Wednesday, February 12, 2014

ఏడవ అధ్యాయం : జ్ఞానవిజ్ఞానయోగః

ఓ అర్జునా! అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడై, అనన్య భావముతో మత్పరాయణుడై, యోగమందు నిమగ్నుడవై, సంపూర్ణ విభూతిబల ఐస్వర్యాదిగుణ యుక్తుడవై, సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను నిస్సందేహముగా తెలిసికొనగలవో, ఆ విధమును తెలిపెదను వినుము. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలిసికొనవలసినది ఏదియు మిగులదు (7:1,2)
వేలకొలది మనుష్యులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలోగూడా ఒకానొకడు మాత్రమే నా యదార్థమును (తత్వమును) తెలుసుకొన గలుగుచున్నాడు. (7:౩)
ఓ మహోబాహొ! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అని నా ప్రక్రుతి ఎనిమిది విధములుగా కలదు. ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రక్కృతి అని అందురు. (7:4)
ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరియొక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి అని తెలిసికొనుము. (7:5)
ఓ అర్జునా! సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతులనుండియే పుట్టుచున్నవి. ఈ జగత్తు యొక్క పుట్టుకయు వినాశనము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే కారకుడను. (7:6)
అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియు ప్రపంచమున లేదు. నాకంటె పరమమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. (7:7)
ఓ అర్జునా! జలములలో రసతన్మాత్రను నేనే. సుర్యచంద్రులలో కాంతిని నేనే. వేదములన్నింటిలోను ఓంకారమును, ఆకాశము నందు శబ్దమును, మానవులయందు పౌరుషమును, పృథ్వి యందు పవిత్రగ్రంధము, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే అయియున్నాను (సర్వమూ నేనే అయివున్నాను). (7:8,9)
ఓ పార్థా! సమస్త భూతములకును నన్ను శాశ్వత మైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. (7:10)
సాత్విక, రాజస, తామస భావములన్నియును నా నుండియే కలుగుచున్నవి తెలిసికొనుము. కానీ! యధార్థముగా వాటిలో నేను గాని, నాలో అవిగని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. (7:12)
ఈ జగత్తు అనగా ప్రాణిసముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మొహితమగు చున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాస్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలిసికొనలేకున్నవి. (7:13)
నా మాయ త్రిగునాత్మకమైనది. అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలం నిరంతరమూ నన్నే భజించువారు ఈ మాయను సునాయాసంగా దాటుచున్నారు. (7:14)
మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, రాక్షస ప్రవ్రుత్తిగల వారును, నరాధములును, మూడులును, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. (7:15)
ఆర్తులు(శుభాశుభ కర్మలు చేయుచు చరించుచు సుఖసంపదలను కోరుకోనువారును), జిజ్ఞాసులు(ఐహిక విషయములపై ఆశక్తిని వీడి పరమాత్మతతత్త్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు), అర్ధకాములు(శారీరక మానసిక సంతాపములకు గురియైన ఆర్తులు), జ్ఞానులు(పరమాత్మప్రాప్తినందిన) అను నాలుగు విధములైన భక్తులు నన్నాశ్రయించుచున్నారు.
(7:16)  
ఈ చతుర్విధభక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్తితుడై, అనన్య భక్తియుతుడైన జ్ఞానీ అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నా తత్త్వమును తెలిసికోనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడును నాకు అత్యంత ప్రియుడైయున్నాడు. (7:17)
ఈ చతుర్విధభక్తులందరును ఉదారులే. కానీ జ్ఞానియైన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్దిని నాయందే స్తిరముగా ఉంచి నన్నే ఉన్నతగతి స్వరూపునిగా భావించును. ఈ విదముగా అతడు నా యందే స్థిరముగా ఉన్నాడు. (7:18)
జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మము లెత్తిన పిదప విజ్ఞానియై భగవత్తత్వమును ఎరిగి, సర్వమూ వాసుదేవమయమే (పరమాత్మమయమే) యని భావించి, నన్ను శరణుపొందును. (7:19)
అనేకవిధములైన భోగవాంఛలలో కూరుకొనిపొయినవారి జ్ఞానం అంతరించిపోవుచు. వారు తమతమ స్వభావములకు అనుగుణముగా వారివారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించురు. (7:20)
అల్పబుద్దులగు భక్తులు పొందేది ఫలములు గూడా అల్పములే. ఇతర దేవతలను పుజించువారు ఆ దేవతలనే చేరుదురు. ఎవరైతే నా స్వస్వరుపాన్ని(పరమాత్మను) గ్రహించి వారి మనసు నా యందు లగ్నం చేస్తారో వారు నన్నే పొందుచున్నారు. (7:23)
నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును, మనస్సునకును కనబడనివాడను. నా పరమభావమును బుద్దిహీనులు గ్రహింపక, ఇట్టి నన్ను సాధారణ మనుస్యునిగా తలంచుచున్నారు.  (7:24)
నా యోగమాయవలన నేను అందరికి గోచరింపను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాస్వతునిగా, పరమేస్వరునిగా తెలుసుకొనలేరు. (7:25)
ఓ అర్జునా! గతించినకాలమునకు చెందినట్టివియు, ప్రస్తుత కాలమునందు ఉన్నట్టివియు ఐన చరాచర ప్రాణులన్నింటిని నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున జన్మించు ప్రాణులను గుర్చియు నేను ఎరుగుదును. కాని నాయందు భక్తిశ్రద్దలు గలవారు తప్ప వేరెవ్వరు నన్ను ఎరుగరు. అయితే నాయందు శ్రద్దలేని వాడు నన్ను ఎరుంగడు. (7:26) 
ఓ అర్జునా! జగత్తునందు ప్రాణులన్నియును రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఃఖాదిద్వంద్వముల ప్రభావము వలన అంతులేని మొహములో పడిపోవుచున్నవి.కానీ నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు నశించును అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యేదరు. ద్రుడనిశ్చయము గల్గిన అట్టి భక్తులు అన్నివిధముల నన్నే భజింతురు. (7:27,28)
నన్ను సరణుపొంది జరామరణవిముక్తికై ప్రయత్నించు వారు ఆ పరబ్రహ్మను, సంపూర్ణ ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు. (7:29)

ఆదిభూత, ఆధిదైవ, ఆధియజ్ఞములతోపాటు అందరికిని ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలమునందైనను తెలిసికొనువారు నిశ్చల బుద్దితో నన్నే చేరుదురు. (7:౩౦)

No comments:

Post a Comment