Wednesday, February 12, 2014

తొమ్మిదవ అధ్యాయం : రాజవిద్యారాజగుహ్యయోగః

ఈ బ్రహ్మజ్ఞానము విద్యలకు తలమానికము. సమస్త గోప్యవిషయములకును శిరోభూషనము. అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సులువైనది. (9:2)
ఓ పరంపతా! ఈ ధర్మమార్గమునందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూప సంసారచక్రమునందు మళ్ళి మళ్ళి పడుచున్నారు. (9:౩)
నిరాకారపరబ్రహ్మమైన నాచేతనే ఈ జగత్తంతయును వ్యాపించబడియున్నది. ప్రాణులన్నియు నాయందే యున్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు లేను. (9:4)
ఆకాశమునుండి ఉత్పన్నమై, సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకశామునందే స్తితమై యుండును. అట్లే నా సంకల్పము ద్వారా భూతములు (ప్రాణులు) అన్నియును నా యందే ఉన్నవని గ్రహించుము. (9:6)
ఓ కౌంతేయా! కల్పాంతము(ప్రళయకాలము) నందు భూతములన్నియును నా ప్రకృతినే చేరును. మరల సృష్టి ఆరంభమున(కల్పాదియందు) సకల ప్రాణులను నేను సృజించుచుందును. తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూత సముదాయమును నా ప్రక్రుతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరలమరల పుట్టించుచున్నాను. (9:7,8)
ఓ అర్జునా! ఆ సృష్ట్యాది కర్మలయందు సంగములేక  ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బందింపవు. (9:9)     
ఓ అర్జునా! సాక్షిభూతుడైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే జగత్తు పరిభ్రమించుచున్నది. (9:10)
నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను (ప్రభువును) ఐన నన్ను లోకకల్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి, నన్ను అలక్ష్యము చేయుచున్నారు. (9:11)  
వ్యర్ధములైన ఆశలచే, కర్మలచే నిక్షిప్తములైన మనస్సుగల అజ్ఞానులు రాక్షసీ ఆసురీ మోహినీ స్వభావములను పొందుచున్నారు. (9:12)
కానీ ఓ పార్థా! దైవీప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకూ మూలకారణముగను, అవ్యయునిగాను (అక్షరరూపునిగను) తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజించుచున్నారు.   (9:13)
ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నించురు. పదేపదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను సేవించుచున్నారు. (9:14)
మరికొందరు జ్ఞానులు నిర్గుణనిరాకార బ్రహ్మమైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేధభావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును ద్వైత భావముతో పూజించుచున్నారు. (9:15)
ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఋక్సామ యజుర్వేదములను నేనే. (9:17)
పరమగతియైన పరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే, అందరికిని నివాసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును అసింపక హితమొనర్చువాడను, అందరి ఉత్పత్తిప్రళయములకు హేతువును, వారి స్తితికి ఆధారమును, నిధానమును, అవ్యయ బీజమును నేనే. (9:18)
ఓ అర్జునా! సూర్యరూపమున నేనే తలపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరల వదలెను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలము (జగత్తును)) గూడ నేనే.  (9:19)
సకామకర్మలు చేయువారు, సోమరసపానము చేయువారును, పాపరహితులై యజ్ఞములద్వార నన్ను సేవించి, స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు.అట్టివారు స్వర్గమునకు పోయి స్వర్గ సుఖములను అనుభవించి, ఆ పుణ్యములు అయిపోగానే మరల ఈ మర్త్యలోకమున జనింతురు.అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. క్షీనింపగానే తిరిగి మానవలోకమున జన్మించెదరు. (9:20,21)
పరమాత్మస్వరూపుడును(నిరాకారుడైన) అయిన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు, నిష్కామ భావముతో కర్మలను చేయుచు (అంటే కర్మఫలాన్ని భగవదర్పితం చేయుచు) సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. (9:22)
ఓ అర్జునా! శ్రద్దాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పుజించినట్లే. కానీ వారిపూజలు అవిది పూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో మరియు అవిద్యతో కూడినవి. ఏలనన సకల యజ్ఞములకు భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు. కావున వారు అందరు పతనమగుచున్నారు (పునర్జన్మ పొందుచున్నారు) (9:23,24)
దేవతలను పూజించువారు దేవలోకమును చేరుదురు. పితరులను సేవించువారు పిత్రులోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను నిరాకారముగా ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. (9:25)
ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. (9:26)
ఓ కౌంతేయ ! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించుదానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పించుము. ఈ విధముగా సన్యాసయోగమునందు స్తిరచిత్తుడవై, అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మ బంధములనుండి ముక్తుడవయ్యెదవు. పిదప నా పరమపదమునే (అంటే నన్నే) పొందగలవు. (9:27,28)
నేను సకలభభూతముల(ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనునే వారియందు ఉందును. (9:29)
మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యదార్థముగా అతడు నిశ్చయబుద్ది గలవాడు. అనగా అతడు సాదువేయని గ్రహింపుము. (9:౩౦)
కౌంతేయా ! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును . శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడేన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. (9:31)
ఈ మానవ శరీరము క్షణబంగురము. సుఖరహితము, ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించి ముక్తుడవగుము. (9:౩౩)

పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు. (9:34)

No comments:

Post a Comment